హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): దేశంలోని పలు సెంట్రల్ యూనివర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) లు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ పరీక్షలను రెండు విడతల్లో ఆగస్టు 20 వరకు నిర్వహిస్తారు. తొలి విడత పరీక్షలు ఈ నెల 15న, రెండో విడత ఆగస్టు 4 నుంచి మొదలవుతాయి. మొదటి విడత పరీక్షల అడ్మిట్కార్డుల డౌన్లోడింగ్ మంగళవారం నుంచే ప్రారంభమైంది.
రెండో విడత అడ్మిట్ కార్డులను జూలై 31 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షలను దేశంలోని 500 నగరాలతోపాటు విదేశాల్లోని 10 నగరాల్లో నిర్వహిస్తామని మంగళవారం ఆన్లైన్లో ఆయన మీడియాకు తెలిపారు. ఈ నెల 17న నీట్ యూజీ ఎగ్జామ్స్ ఉన్న కారణంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను ఎంచుకున్న విద్యార్థులకు రెండోవిడతలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్న నగరాల్లోనే పరీక్ష కేంద్రాలను కేటాయించినట్టు చెప్పారు. సిటీ చాయిస్ను మార్చుకోవాల్సిన వారు.. cuet-ug@nta.ac.in ఈ మెయిల్ ఐడీ, 011-40759000 నంబర్ సంప్రదించి మార్చుకోవచ్చని సూచించారు. వివరాలకు https://cuet.samarth.ac.in ను చూడాలని కోరారు.