సీసీఎంబీ శాస్త్రవేత్త దివ్యతేజకు యంగ్ సైంటిస్ట్ పురస్కారం
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్-19 జన్యువులను విశ్లేషించి, వాటి ఉత్పరివర్తనాలపై అధ్యయనం చేసినందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్త డాక్టర్ దివ్యతేజ సౌపాటిని సీఎస్ఐఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డు వరించింది. బయాలజికల్ సైన్స్ విభాగంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. కణాల్లో జెనెటిక్, ఎపీజెనెటిక్ వేరియేషన్ గురించి అర్థం చేసుకొనేందుకు ఆయన పరిశోధనలు చేశారు. దివ్యతేజ పరిశోధన ఫలితంగానే ఈ ఏడాది తొలిసారి దేశంలో ఏ3ఐ కరోనా వేరియంట్ను గుర్తించారు. ఇతర వేరియంట్లతో పోల్చితే దీని ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయగలిగారు. 10వేలకు పైగా వైరస్ జన్యువులను సీక్వెన్స్ చేయడంతో పాటు, 60వేల వైరస్ జన్యువులను విశ్లేషించారు. వైరస్ వేరియంట్లను విశ్లేషించడంలో సీసీఎంబీకి దివ్యతేజ అధ్యయనం ఎంతగానో తోడ్పడింది. ‘కరోనా వైరస్ వేరియంట్లను గుర్తించడం, తద్వారా ప్రభావాన్ని అంచనా వేయడంలో సీసీఎంబీతో కలిసి మా బృందం పని చేయచడం సంతోషంగా ఉన్నది. సమాజహితానికి మా జ్ఞానాన్ని వినియోగించే అవకాశం రావడం గర్వంగా ఉన్నది. నాకు ఎంతగానో మద్దతు అందించిన నా బృందానికి, కుటుంబానికి, స్నేహితులకు, మెంటార్స్కు ఈ అవార్డు అంకితం’ అని సౌపాటి అన్నారు. ‘సౌపాటి ఎంతో టాలెంట్ ఉన్న యంగ్ సైంటిస్ట్. యంగ్ సైంటిస్ట్లకు మద్దతు అందించేందుకు సీసీఎంబీ సిద్ధంగా ఉన్నది’ అని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ కే నందికూరి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీసీఎంబీ పీహెచ్డీ విద్యార్థులు ఆవిష్కరించిన డ్రై స్వాబ్ ఆధారిత టెస్టింగ్ విధానానికి సీఎస్ఐఆర్ టెక్నాలజీ అవార్డు వచ్చిందని వెల్లడించారు.