హైదరాబాద్ : నగరంలోని చంద్రాయణగుట్టలో గల ఉప్పుగూడ, పరివార్ టౌన్షిప్లో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. ప్రజలు తమంత తాముగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని 100 శాతం వ్యాక్సినేటేడ్ నగరంగా తయారుచేయాలన్నారు.
వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. డోర్ టు డోర్ సర్వేను పూర్తిచేసి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో నెలాఖరులోగా 100 శాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేస్తామని స్ధానిక ప్రతినిధులు సీఎస్కు హామీ ఇచ్చారు. అర్హులైన ప్రజలందరికి మొదటి విడత వ్యాక్సినేషన్ జరిగేలా జీహెచ్ఎంసీ ఏరియా వైద్యఆరోగ్య శాఖ 100 శాతం వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ మాప్ అప్ డ్రైవ్ ను చేపట్టింది. కాలనీల వారిగా విధానాన్ని రూపొందించి డోర్ టు డోర్ సర్వేతో పాటు వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 585 కాలనీలల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. 47,104 మందికి మొదటి విడత, 7304 మందికి రెండవ విడత వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. జీహెచ్ఎంసీ నుండి 4182 మంది సిబ్బందిని, వైద్యశాఖ నుండి 1,639 మంది సిబ్బందిని రంగంలోని దించడం జరిగింది. కాలనీల స్ధాయిలో మొబైల్ వ్యాక్సినేషన్ కోసం 594 వాహనాలను వినియోగించడమైనది. ఈ పర్యటనలో ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎమ్ రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.