హైదరాబాద్ : భద్రాద్రి జిల్లాలో సహాయ, పునరావాస చర్యలపై సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిగ్రామంలో మెడికల్, విద్యుత్, శానిటేషన్ విభాగాల బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.
ఇతర జిల్లాల పారిశుధ్య సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టామని, ప్రస్తుతం 436 వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆయా శిబిరాల్లో ఇప్పటి వరకు పదివేలమందికిపైగా వైద్య చికిత్సలు అందించినట్లు చెప్పారు. గర్భిణులకు పీహెచ్సీల్లో వైద్యం అందిస్తున్నామని, ప్రతి పునరావాస కేంద్రంలోనూ వైద్య శిబిరాల ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు.