గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కష్టపడాలి
సీఎం ఆకాంక్షను నెరవేర్చాలి
పల్లె ప్రగతిలో పాల్గొన్న సీఎస్
రంగారెడ్డి : గ్రామాలు పచ్చదనంతో వెల్లివెరియాలని, పారిశుధ్ధ్యం, అభివృద్ధిలో ముందంజలో నిలవాలనే ఉద్దేశంతోనే హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాంలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొని కష్టపడి పని చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష నెరవేరుతుందన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజిపూర్ గ్రామంలో నిర్వహించిన నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో స్ధానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు పచ్చదనం కోసం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమాలు పది రోజుల పాటు జరుగుతాయని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కష్టపడి పనిచేస్తే గ్రామాలు శుభ్రంగా తయారవుతాయని సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు.
గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులు ప్రతి రోజు ఉదయం పారిశుధ్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసిన తర్వాత ఏవిధమైన వ్యాధులు ప్రబలడం లేదన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గాయన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లు సమకూర్చామని తెలిపారు.
గ్రామంలో నీరు నిలిచే ప్రదేశాలు లేకుండా చూడాలని, డ్రై డే ను నిర్వహించాలని సీఎస్ సూచించారు. దీని ద్వారా మలేరియా, డెంగ్యూ వ్యాధులను దూరం చేయొచ్చన్నారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంను వాడుకలోకి తీసుకురావాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు సత్వరం విడుదల చేస్తున్నామన్నారు. గ్రామస్ధుల కోరిక మేరకు సీసీ రోడ్ను మంజూరు చేసి, త్వరితగతిన పని పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.