హైదరాబాద్ : ప్రజా సేవ చేసేందుకు నియమితులైన అధికారులు మంచి ఆశయంతో ముందుకు సాగితే అద్భుతాలు సృష్టించవచ్చని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన అఖిల భారత సర్వీసులు, కేంద్ర ప్రజా సర్వీసుల అధికారుల 15 వారాల ఫౌండేషన్ కోర్స్ శిక్షణా కార్యక్రమాన్ని సోమేశ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మేటి ఆలోచనతో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ప్రారంభించాలని తపన ప్రజాసేవలో ఉండే అధికారులలో ఉంటుందని అన్నారు. మంచి ఆశయ సిద్ధితో ముందుకు సాగితే అవరోధాలను అధిగమించి అద్భుతాలు సృష్టించొచ్చు అని చెప్పారు. చిన్న ఆలోచనలతో పెద్ద మార్పుకు నాంది పలకవచ్చిన ఆయన యువ అధికారులకు సూచించారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞంలా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం గురించి అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమం కింద దాదాపు 200 కోట్లకు పైగా మొక్కలు నాటినట్టుగా ఆయన వివరించారు. ఫలితంగా రాష్ట్ర పచ్చదనంలో దాదాపు 7.7 శాతం మేర వృద్ధి నమోదు అయినట్టుగా కేంద్ర సంస్థల సర్వేలు వెల్లడించాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు చేపట్టిన పల్లె ప్రకృతి వనం, పల్లె క్రీడా ప్రాంగణాలు, బృహత్ క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కూడా అద్భుతంగా రాష్ట్రంలో అమలవుతోందని.. ప్రజలకూ పర్యావరణానికి మేలు చేస్తున్నాయని ఆయన అధికారులకు ఉదహరించారు.
అఖిల భారత సర్వీసుల అధికారులు నిత్యం పని ఒత్తిడితో బిజీగా గడుపాల్సిన పరిస్థితి ఉంటుందని.. అయితే పనితో పాటుగానే వ్యక్తిగత జీవితానికీ తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని సీఎస్ యువ అధికారులకు సూచించారు. ఇటీవలి కాలంలో యువత సెల్ ఫోనులకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నప్పటికీ .. పుస్తక పఠనాన్ని మరవద్దని ఆయన యువ అధికారులకు సూచించారు. తమతమ రంగాలలో ఆసక్తి మేరకు పుస్తక పఠనాన్ని కొనసాగించాలని ఆయన చెప్పారు. జీవితంలో కుటుంబానికి, మిత్రులకూ తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని సీఎస్ అధికారులకు సూచించారు. మిత్రులు పార్టీలను చేసుకొనేందుకే కాదని కీలకమైన, క్లిష్టమైన సమయాలలో మనకు దిశా నిర్ధేశం చేసేలా, బాసటగా నిలిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతారని అన్నారు. అధికారులు విధులలో బిజీగా ఉన్నప్పటికీ మానవ సంబంధాలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు.