హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ప్రతి ఒకరూ కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం), జపాన్ ప్రభుత్వ పథకం స్పెసిఫైడ్ సిల్ వరర్స్ కింద జపాన్లో పనిచేసేందుకు అర్హత గల నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఎంపికైన 25 మంది అభ్యర్థులకు మంగళవారం నుంచి రాజేంద్రనగర్లోని గ్రామీణ అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఆర్డీ)లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సోమేశ్కుమార్ ప్రారంభించి మాట్లాడారు.
తెలంగాణ బ్రాండ్ను ముందుకు తీసుకెళ్లాలనే సీఎం కేసీఆర్ విజన్ను ఆదర్శంగా తీసుకోవాలని, శిక్షణ పూర్తి చేసుకొనే 25 మంది అభ్యర్థులు ఫిబ్రవరి చివరిలోగా ఆఫర్ లెటర్స్ పొందుతారని తెలిపారు. జపాన్కు వెళ్లే అభ్యర్థులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టాంకాం వైస్ చైర్మన్ రాణి కుముదిని, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖల కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వి, వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి, జపాన్ దేశ నావిష్ సంస్థ సీఈవో టకాకా ఓసి ఋషి, ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, టాంకాం సీఈవో విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.