CS Shanti Kumari | రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల ఏర్పాటు కోసం భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం శాంతి కుమారి శుక్రవారం సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, తల్లిదండ్రులు తమ పిల్లలను కలవడానికి ప్రత్యేక గది ఉండేలా చూడాలని.. భవనాలన్నింటికీ ఏకరీతి డిజైన్ను వారంలోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ ప్రాజెక్ట్కి నోడల్ ఆఫీసర్గా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారన్నారు. 49 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, అందులో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది గ్రౌండింగ్కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 31 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా, మిగిలిన పది పాఠశాలలకు సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.