హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి లక్ష్యం నెరవేరిందని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. బుధవారం బీఆర్కే భవన్లో వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో వానకాలం, యాసంగి కలిపి మొత్తం 1.20 కోట్ల ఎకరాల్లో వరి సాగైనట్టు తెలిపారు. వరి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో, పత్తి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్నదని వివరించారు.
వచ్చే వానకాలం సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాలను ముందస్తుగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సాంకేతికతపై స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వ్యవసాయంలో సాంకేతికతను జోడించడంతో పాటు అగ్రి స్టార్టప్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో రైతులకు డిజిటల్ సర్వీసులను అందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్గా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కమిటీలో వ్యవసాయ, రెవెన్యూ, ఐటీ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.