హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్న ప్రస్తుత తరుణంలో ధాన్యం కొనుగోళ్లను అన్ని కేంద్రాల్లో పూర్తిస్థాయిలో, వేగంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. మార్చి, ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టం అంచనా ప్రక్రియను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. కంటివెలుగు, ఆరోగ్య మహిళ శిబిరాలను సందర్శించి, ప్రజలకు అత్యంత సంతృప్తికరంగా సేవలందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవో 58 పట్టాలను త్వరగా పంపిణీ చేయాలని చెప్పారు. ఆయిల్పాం సాగును ప్రోత్సహించేందుకు వినూత్న పద్ధతులను సూచించాలని కోరారు. జిల్లాలో డీఏపీ, యూరియా తదితర అన్ని రకాల ఎరువులు సరిపడా సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు.