హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది జనవరి చివరి నాటికి పన్ను వసూళ్ల ద్వారా రాష్ర్టానికి రూ.91,145 కోట్ల ఆదాయం సమకూరిందని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి వెల్లడించారు. అలాగే, రూ.6,996 కోట్ల పన్నేతర ఆదాయం సమకూరినట్టు వివరించారు. హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రవాణా, మైనింగ్ తదితర శాఖల అధికారులతో బుధవారం ఆమె సొంత పన్నులు, పన్నేతర ఆదాయాల్లో సాధించిన పురోగతిపై సమీక్షించారు.
శాంతికుమారి మాట్లాడుతూ, ఈ ఏడాది లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లు పెంచేందుకు అవసరమైతే ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహించి, లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రేషన్, స్టాంప్స్ కమిషనర్ రాహుల్ బొజ్జా, కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్ నీతూకుమారిప్రసాద్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మ ద్, రవాణాశాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్జ్యోతి, అధికారులు పాల్గొన్నారు.