హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారులతో వంద బృందాలు ఏర్పాటుచేసి, మండలాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించటంతో సీఎస్ ఈ సమావేశం ఏర్పాటుచేశారు. అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యల సమాచారాన్ని ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి తెప్పిస్తున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తాసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఈ మేరకు బుధవారం ఉదయం బీఆర్కేభవన్లో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సీసీఎల్ఏ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ రజత్కుమార్ సైనీ, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావుతో సీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శుక్రవారం నాటి సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై వీరు సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ధరణిలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై 11న సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా ఆహ్వానిస్త్తూ బుధవారం సీఎస్ సోమేశ్కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని మండలాల్లో ప్రత్యేక బృందాలు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నాయి.