హైదరాబాద్ : సాఫ్ట్నెట్, టీశాట్ కార్యక్రమాలపై వర్కింగ్ బాడీతో బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వ్యవసాయం, విద్యా, మహిళా శిశు సంక్షేమం, యువజన, పంచాయతీరాజ్ శాఖలు తమ విభాగాలకు చెందిన అంశాలపై విజ్ఞాన దాయకమైన కార్యక్రమాలను రూపొందించి టీశాట్ ద్వారా ప్రజలకు అందించాలని సూచించారు. ప్రధానంగా రైతులకు సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్ పామ్ సాగు, హరిత సంపద, పశుపోషణ తదితర అంశాలపై కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
పంచాయతీరాజ్కు సంబంధించి ఉత్తమ సర్పంచులు కావడానికి మార్గాలు, గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ ఆర్థిక వనరుల పెంపులాంటి అంశాలు, యువజనులకు సంబంధించి పోటీ పరీక్షలకు సంబంధించి కెరీర్ డెవలప్మెంట్, విద్యాపరమైన ప్రావీణ్యత.. పోలీస్ నియామకాలకు సంబంధించి ప్రిపరేషన్, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, గంజాయి సాగు నిషేధం తదితర అంశాలపై కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమాల రూపకల్పన, ప్రసారాలతో పాటు స్వీయ ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలని చెప్పారు. వివిధ శాఖలకు వీడియో, టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమాలను సాఫ్ట్నెట్, టీశాట్ల ద్వారా రూపొందించాలని సూచించారు.
లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లను అందించడంలో టీ శాట్ చేసిన కృషిని సీఎస్ అభినందించారు. సమావేశంలో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కే సీతారామారావు, ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ హరిప్రీత్ సింగ్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు దివ్య దేవరాజన్, తెలంగాణా టెక్నలాజికల్ సర్వీసెస్ ఎండీ వెంకటేశ్వర్ రావు, సాఫ్ట్ నెట్ సీఈవో శైలేష్ రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.