హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో రైల్ బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎల్అండ్టీ నుంచి 100 శాతం వాటాను సొంతం చేసుకున్న ప్రభుత్వం.. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నూతన బోర్డును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మెట్రో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. బోర్డు చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు వ్యవహరించనుండగా, మేనేజింగ్ డైరెక్టర్గా సర్ఫరాజ్ అహ్మద్ను నియమించింది. డైరెక్టర్లుగా జయేశ్రంజన్(ఎంఏయూడీ), వికాస్ రాజ్(ఆర్అండ్బీ), సందీప్ కుమార్ సుల్తానియా(ఆర్థిక), శివధర్రెడ్డి (డీజీపీ), అశోక్ రెడ్డి(వాటర్బోర్డు), జితేశ్పాటిల్(టీజీఎస్పీడీసీఎల్), జేఎండీగా శివేంద్రప్రతాప్లతో కూడిన బోర్డును ప్రకటించింది. మెట్రోరైల్ స్వాధీన ప్రక్రియను రూ.15 వేల కోట్ల వ్యయంతో ఏప్రిల్ 30 నాటికి పూర్తిచేయనుండగా, నామినీ డైరెక్టర్లు, ప్రభుత్వానికి వాటాలను కేటాయిస్తూ సర్కార్ ఆదేశాలిచ్చింది.
నూతన సీఎస్ను నియమించేనా?
రామకృష్ణారావును మెట్రోకు చైర్మన్గా ప్రకటించడంతో కొత్త సీఎస్ ఎవరనే చర్చ జోరుగా జరుగుతున్నది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు సర్వీస్ జూన్ నెలాఖరు తో ముగియనుండగా నూతన సీఎస్ అంశం తెరపైకి వచ్చింది. వాస్తవానికి 2025 ఆగస్టు 30న ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా, సీఎం విజ్ఞప్తి మే రకు కేంద్రం సర్వీసును పొడిగించుకుం టూ వచ్చింది. ప్రస్తుత సీఎస్ ఉద్యోగ విరమణ గడువు దగ్గరపడుతుండటంతోమెట్రోరైల్ చైర్మన్గా ఆయనను నియామించారు. జూన్ 30 వరకు ఆయనను రెండు పదవుల్లో కొనసాగిస్తారా? లేదా కొత్త సీఎస్ను నియమిస్తారా? అనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది. ఒకవేళ కొత్త చైర్మన్ను నియమిస్తే రేసులో సీనియర్ ఐఏఎస్ జయేశ్రంజన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆయనతోపాటు శశాంక్ గోయల్, వికాస్రాజ్ కూడా పోటీలో ఉన్నట్టు సమాచారం.