హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలకు తెలంగాణ ముస్తాబైంది. గోల్కొండ కోట త్రివర్ణ శోభ సంతరించుకున్నది. విద్యుత్తు లైట్ల వెలుగులో చారిత్రక దుర్గం మూడురంగుల్లో అద్భుతంగా కనువిందు చేస్తున్నది. సచివాలయం, అసెంబ్లీ మొదలుకొని అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలు, రాష్ట్రవ్యాప్తంగాజిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను మువ్వన్నెల రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. పంద్రాగస్టు వేడుకలు జరిగే కోట మొత్తాన్ని త్రివర్ణ వస్త్రంతో ముస్తాబు చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ పతాకావిషరణ చేయనున్నారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుంది. దీనికి ముందుగా సీఎం పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. దాదాపు వెయ్యి మంది కళాకారులు ఆయనకు స్వాగతం పలుకుతారు. కోట పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదివారం పరిశీలించారు. ఏర్పాట్లు మొత్తం సకాలంలో పూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
నారాయణపేటలో వాకిటి సునీత,మంచిర్యాలలో పల్లా
అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విధంగా మంత్రులు, విప్లు, ప్రభుత్వ సలహాదారులు పతాకావిష్కరణ చేసి, గౌరవ వందనం స్వీకరిస్తారు. వివిధ కారణాలతో నారాయణపేట, మంచిర్యాలలో జాతీయ పతాకావిష్కరణ చేసే డిజిగ్నిటరీలను మార్చారు. నారాయణపేట జిల్లాలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, మంచిర్యాలలో తెలంగాణ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు.