హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జీవో -317తో వేరే జిల్లాల్లోకి బదిలీ అయిన టీచర్లకు పూర్వపు జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. టీచర్ల బదిలీలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ బషీర్బాగ్లోని తన కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులతో సమీక్షించారు.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు పూర్వపు జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకొని బదిలీలకు అవకాశమిచ్చామని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యథాతథంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. జీవో -317 కింద బదిలీ అయిన టీచర్లకు ఈ నెల 12 నుంచి 14 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయులందరికీ సమన్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 59 వేల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకొన్నారని, వీటి పరిశీలన పూర్తయినట్టు వివరించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.
అందరికీ అవకాశం కల్పించాలి : పీఆర్టీయూ తెలంగాణ
బదిలీల దరఖాస్తుల్లో భాగంగా కేవలం కోర్టుకెళ్లిన వారే కాకుండా, అందరికీ అవకాశం కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధానకార్యదర్శి అంజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.