కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ అధికారి మృతిచెందగా, మరో జవాన్ గాయపడ్డాడు. బీజాపూర్ జిల్లా బాసగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ సమీంలో ఉన్న పుత్కేల్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 168వ బెటాలియన్కి చెందిన భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో గాలింపు బృందాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు.
ఈ క్రమంలో మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్బీ తిర్కి తీవ్రంగా గాయపడ్డారు. దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందారు. ఆయన జార్ఖండ్కు చెందినవారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరుపుతూనే మావోయిస్టులు అక్కడి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలోకి తప్పించుకున్నారని చెప్పారు. వారికోసం గాలింపు కొనసాగుతున్నదని బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ వెల్లడించారు.