హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): చీడపీడలు, కరువుతో యాసంగిలో తీవ్రంగా దెబ్బ తింటున్న వరిపంట ఆందోళన కలిగిస్తున్నదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు తెలిపారు. ఈ పంట నష్టానికి పరిహారమివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే భారీ విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లిందని, ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ సీజన్ నుంచే పంటల బీమాను అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో రైతులు ఆర్థికంగా పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుబంధు విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల నుంచి వ్యతిరేకత తప్పదని శ్రీహరిరావు హెచ్చరించారు.