హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): గత నెలలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టం లెక్కలను వ్యవసాయ శాఖ తేల్చింది. మొత్తం 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వెల్లడించింది. పంటలు దెబ్బతినడం వల్ల 15,246 మంది రైతులకు నష్టం వాటిల్లినట్టు తేల్చింది. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం అందిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 15,812 ఎకరాలకుగానూ రూ. 15.81 కోట్ల పరిహారం అందించాలని నిర్ణయించింది. ఈ పరిహారాన్ని వారం రోజుల్లో రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం లేఖ రాసింది. ఈసీ అనుమతి రాగానే పంట నష్టపరిహారం రైతులకు అందజేయనుంది. అయితే సుమారు 30వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగితే ప్రభుత్వం కేవలం 15 వేల ఎకరాల్లోనే నష్టం జరిగినట్టు అంచనా వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.