మహబూబ్ నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగంలో అవలంభిస్తున్న విధానం వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Former Minister Srinivas Goud ) ఆరోపించారు. ఏపీకి అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండడంతో తెలంగాణలో క్రాప్ హాలిడే ( Crop Holiday ) కు సిద్ధమవుతుండగా ఏపీలోలో మాత్రం పండుగ వాతావరణం ( Crop Festival ) నెలకొందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ నీటిని ఆంధ్రాకు తరలిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరును తీసుకునే ధైర్యం చేసేది కాదని వెల్లడించారు. వెలిగొండ టన్నెల్ పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి కాగా దానితో సమానంగా ప్రారంభించిన ఎస్ఎల్బీసీ ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు.
నికర జలాల నుంచి 11 టీఎంసీ లు వెలిగొండ ద్వారా సాగునీరు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా కానీ, దానికి మించి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలమూరు రైతుల మీద ప్రేమ ఉంటే వెలిగొండ ప్రాజెక్ట్ కు నికర జలాల నుంచి నీళ్లు తీసుకోకుండా వరద జలల నుంచి మాత్రమే నీళ్లు తీసుకోవాలని ఏపీకి సూచించాలని కోరారు. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ మాత్రం క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చిందని గుర్తు చేశారు.
జిల్లాలో ఉన్న రిజర్వాయర్లలో 60 టీఎంసీ ల నీరు నింపేందుకు అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం ఆ పని చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమలు చేపట్టనున్నా మని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆంజనేయులు, రహమాన్, మాజీ జడ్పీటీసీ నరేందర్, మాజీ ఎంపీపీ బాలరాజు, సింగిల్ విండో చైర్మన్లు రాజేశ్వర్ రెడ్డి, కృష్ణయ్య గౌడ్, హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు , నాయకులు పాల్గొన్నారు.