జోగులాంబ గద్వాల: గద్వాల పట్టణంలో మొసలి (Crocodile) కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని హమాలీ కాలనీలో ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి మొసలి వచ్చింది. దానిని చూసి శునకాలు పెద్దపెట్టున మొరుగుతూ అనుసరిడంతో.. మేల్కొన్న స్థానికులు మొసలిని చూసి భయాందోళనలకు గురయ్యారు. కాలనీవాసులంతా కలిసి దానిని బంధించారు. అటవీ అధికారులు సమాచారం అందించారు. దానిని సురక్షిత ప్రాంతాల్లో వదలాలని కోరుతున్నారు.
గత నెల 17న నారాయణపేట జిల్లా కృష్ణ మండలం పరిధిలోని కూసుమూర్తి గ్రామ శివారులోని భీమా నదిలో మొసలి ఓ రైతును లాక్కెళ్లిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన తిప్పన్న అనే రైతు.. నది సమీపంలోని తన పొలానికి సాగునీటి కోసం మోటార్ ఫుట్వాల్ను సరిచేసేందుకు నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో తిప్పన్నపై హఠాత్తుగా దాడి చేసిన మొసలి నీటిలోకి లాక్కెళ్లింది.