హైదరాబాద్ సిటీబ్యూరో/నిజామాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆబ్కారీశాఖ మామూళ్ల మత్తులో జోగుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్శాఖలోని పలువురు అధికారులు, సిబ్బంది హోదాకు తగ్గట్టుగా వసూళ్లకు పాల్పడుతున్నారని మద్యంషాపు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నది. రూ.కోట్లు వెచ్చించి న్యాయంగా దుకాణాలు దక్కించుకున్నా అధికారుల నుంచి మామూళ్ల వేధింపులు తప్పట్లేదని వాపో తున్నారు.
ఫుల్ బాటిల్, హాఫ్, క్వార్టర్ రూపంలో మద్యాన్ని విక్రయించినట్టుగానే అవే పేర్లతో అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఫుల్ అంటే.. ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేయాలంటూ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తున్న ది. వార్షిక మామూళ్లకు అదనంగా హాఫ్, క్వార్టర్ పేరుతో స్టేట్ టాస్క్ఫోర్స్ బృందాలు రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇవి కాకుండా స్థానిక ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్వోలకు అదనంగా నెలవారీ చెల్లింపులు చేసుకోవాలని చెప్తున్నారు. వీరు నెలకు రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేయడంతో పాటు పండుగ వేళల్లో మద్యం బాటిళ్లు డిమాండ్ చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత ముట్టజెప్పకుంటే లేనిపోని సాకులు చూపుతూ కేసులు నమోదు చేస్తారని ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్లో మద్యం వ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 142 వైన్షాపులున్నాయి. ప్రతి దుకాణం నుంచి గుడ్విల్ పేరుతో టార్గెట్లు పెట్టి మరీ ఆబ్కారీ అధికారులు వసూలు చేస్తున్నారని వ్యాపారు లు చెప్తున్నారు. పైసా కూడా లాభం కళ్లజూడకముందే ఇదేం ఖర్మరా బాబూ అంటూ కొత్త గా ఈ వ్యాపారంలోకి వచ్చినవారు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి మరీ వసూళ్లకు తెగబడుతున్నట్టు సమాచారం.
గతంలో కొన్ని దుకాణాలకే ప్రభుత్వం పర్మి ట్ రూములకు అనుమతినిచ్చింది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఎక్సైజ్ అధికారులు పర్మిట్ రూముల పేరిట అక్రమాలకు పాల్పడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్సైజ్ ట్యాక్స్లోనే పర్మిట్ ఫీజును కూడా కలిపేశారు. మద్యం దుకాణాలకు ఏయే ప్రాంతాల్లో పర్మిట్ రూములు ఉండాలన్న దానిపై మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు, లిక్కర్ వ్యాపారంలో బడా వ్యాపారవేత్తల పెత్తనానికి చెక్పెట్టి అందరికీ అవకాశం కల్పించేందుకు లాటరీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.