BJP | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం బీజేపీ ప్రకటించిన 14 కమిటీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో నిరసనగళం వినిపిస్తున్నవారు, పార్టీ వీడే అవకాశం ఉందని ప్రచారంలో ఉన్నవారికి ఈ కమిటీల్లో చోటివ్వడంతో వీటిని ‘అసంతృప్తుల కమిటీలు’గా అభివర్ణిస్తున్నారు. పార్టీపై ఆగ్రహంతో ఉన్న వారిని చల్లబరిచేందుకే ఈ కమిటీలు వేసినట్టు తెలుస్తున్నది. మరీ విచిత్రంగా ‘ఆందోళనలు/నిరసన ప్రదర్శనల’ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించడం గమనార్హం. ఈ కమిటీకి మాజీ ఎంపీ విజయశాంతిని చైర్పర్సన్గా నియమించడం మరో విశేషం. గత కొన్ని నెలలుగా పార్టీపై బహిరంగంగానే నిరసన తెలుపుతున్న ఆమెకు మంచిపదవే దక్కిందంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. పార్టీ వీడతారన్న ప్రచారంలో ఉన్న మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, వివేక్వెంకటస్వామి, గరికపాటి మోహన్రావు, రాజగోపాల్రెడ్డి వంటివారికి ఈ కమిటీల్లో చోటు కల్పించారు. ఈ జాబితాలు చూస్తుంటే అవి పార్టీ కమిటీల్లా లేవని, అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు, వారు బయటకు వెళ్లకుండా ఆపేందుకు వేసిన తూతూమంత్రపు కమిటీల్లా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ కరువవుతున్నది. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదు. అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టకుంటే పార్టీ పరువు పోతుందన్న ఆందోళన పార్టీలో వ్యక్తమవుతున్నది. పరువు నిలబెట్టుకునేందుకు చిన్నాచితకా పార్టీలతో పొత్తు పెట్టుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. అందులో భాగంగా జనసేనతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారని, తెలంగాణలోని 32 స్థానాల్లో బరిలోకి దిగబోతున్నట్టు ఆ పార్టీ ప్రకటించడం అందులో భాగమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. టీడీపీ, మందకృష్ణ మాదిగ పార్టీలతోనూ బీజేపీ చర్చిస్తున్నదని, వారికి తలాకొన్ని సీట్లు ఇచ్చి పరువు కాపాడుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.