నాగర్కర్నూల్, జూలై 4 : ఓ రైతు బతికి ఉండగానే మరణించినట్టు తప్పుడు పత్రాలు పుట్టించి, అతడి పేరున ఉన్న పట్టా భూమిని అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఇందుకు సంబంధించిన కథనాలు ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల వరుసగా ప్రచురితం కావడంతో నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పందించి తహసీల్దార్ను సస్పెండ్ చేయగా, భూభారతి ఆపరేటర్ను తొలగించారు. వివరాలు ఇలా.. అచ్చంపేట మండలం హాజీపూర్కు చెందిన రైతు మశన్న జీవించి ఉండగానే మరణించినట్టుగా కొందరు తప్పుడు పత్రాలు సృష్టించారు.
సదరు రైతుకు తెలియకుండానే ఆయన పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో మార్పు చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకొన్న సదరు రైతు ఫిర్యాదుచేయగా.. పూర్తిస్థాయిలో కలెక్టర్ విచారణ జరుపగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బతికి ఉన్న రైతును చనిపోయినట్టుగా సృష్టించి పట్టా భూమి అసైన్డ్గా నమోదు చేయడానికి కారణమైన తహసీల్దార్ అశోక్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో పాత్రధారులైన భూభారతి ఆపరేటర్ జైపాల్ను తొలగిస్తూ, క్రిమినల్ కేసు నమోదు చేశారు.