హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మత విద్వేషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడంతోనే సరిపోదని, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి, చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజాసింగ్ ప్రజలను మత ప్రాతిపదికన చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తరచుగా చేసే ప్రకటనలు విద్వేషపూరితంగా రెచ్చగొట్టేలా ఉంటున్నాయని తెలిపారు.
శిల్పారామంలో మునావర్ షో సందర్భంగా ఇలాగే ప్రవర్తించారని, ఈ రోజు అరెస్టు చేశాక కూడా పోలీస్ స్టేషన్ నుంచే రెండో వీడియోను విడుదల చేస్తానని చెప్పడం ఆయన విద్వేష రాజకీయాలు ఎంతటి పరాకాష్టకు చేరాయో స్పష్టం చేస్తున్నాయన్నారు. నూపుర్ శర్మ ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన తరువాత కూడా బీజేపీ నాయకత్వం మాటల్లో, చేతల్లో ఎలాంటి మార్పు రాకపోవడం చూస్తే ఇది ఆ పార్టీ ప్రణాళికలో భాగంగానే జరిగినట్టు భావించాల్సి వస్తున్నదని చెప్పారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తమ్మినేని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.