బోధన్: భర్త మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యను హింసిస్తున్నాడు. కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు. భర్త ప్రవర్తనతో భార్య విసిగిపోయింది. అతనితో వేగడం కష్టమని నిర్ణయించుకుంది. భర్త మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయం చూసి తలపై బండరాయితో మోది హత్య చేసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తను హత్య చేసిన అనంతరం భార్య అక్కడి నుంచి పారిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బోధన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణానికి చెందిన బక్కోల్ల బాలయ్య.. కొడుకు బాలు (32), కోడలు గౌతమి ఉన్నారు. బాలుకు పదేండ్ల క్రితం వివాహం జరిగింది. వారు తండ్రితో కాకుండా వేరే ఇంట్లో కాపురం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొన్నేండ్లు సజావుగానే సాగిన వారి కాపురంలో బాలు మద్యానికి బానిసగా మారడంతో కలతలు మొదలయ్యాయి. బాలు నిత్యం మద్యం సేవించి వచ్చి భార్య గౌతమిని వేధిస్తున్నాడు. దాంతో ఆ ఇంట్లో గొడవలు నిత్యకృత్యంగా మారాయి. అంతేగాక ఈ మధ్య బాలు పిల్లలను విక్రయిస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా బాలు.. భార్య గౌతమితో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. భార్య గౌతమి పిల్లలను స్కూల్కు పంపించింది. ఇంతలో బాలు ఫుల్లుగా మద్యం సేవించి వచ్చి పడుకున్నాడు. దాంతో గౌతమి కోపంతో రగిలిపోయింది. మద్యం మత్తులో గాఢనిద్రలోకి జారుకున్న బాలు తలపై బండరాయితో మోది హత్యచేసింది. అనంతరం గౌతమి ఆదరాబాదరాగా ఇంట్లోంచి వెళ్లిపోయింది. అది గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా బాలు రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్నాడు.
దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ పట్టణ సీఐ ప్రేమ్కుమార్, ఎస్సైలు నరేశ్, దరివేముల పీటర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరారీలో ఉన్న గౌతమి కోసం గాలిస్తున్నారు. గౌతమిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ ప్రేమ్ కుమార్ చెప్పారు.