హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(ఏఐఎస్జీఈఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ‘చేతన్ ర్యాలీ’ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ నుంచి టీఎన్జీవో కేంద్ర సంఘానికి చెందిన 50 మంది ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరివెళ్లారు. ఇన్కమ్ టాక్స్ పరిమితి పెంపు, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు వంటి తదితర డిమాండ్లతో ఈ ర్యాలీ చేపట్టనున్నట్టు టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధానకార్యదర్శి మారం జగదీశ్వర్ తెలిపారు.
కేంద్రంలోని మోదీ సర్కార్ ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లిన వారిలో వివిధ జిల్లాల టీఎన్జీవో బాధ్యులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, ఆర్ శ్రీనివాసరావు, లక్ష్మణ్, ముజీవ్ హుస్సేనీ, అలుక కిషన్, నరేందర్, ఆకుల రాజేందర్, సోమన్న, నరసింహరెడ్డి, కొండల్ రెడ్డి, గోవర్దన్రెడ్డి, పర్వతాలు తదితరులు ఉన్నారు.