CPM Leader Tammineni | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్తో పొత్తు విషయంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. గురువారం సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం తమ్మినేని వీరభద్రం మీడియాతోమాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ తేల్చాలి అన్నారు. కాంగ్రెస్తో పొత్తు ఉండాలని ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కమ్యూనిస్టులతో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సుముఖంగా ఉందని ఆయన చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పట్ల బీఆర్ఎస్ శత్రుపూరిత వైఖరి అవలంభిస్తోందని తమ్మినేని ఆరోపించారు. గత ప్రభుత్వ అవినీతి సొమ్మును రాబట్టేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు.