CPM Tammineni | ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం చేరిన జనచైతన్య యాత్రలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడారు. ప్రధాని మోదీ కేంద్రంలో అడుగుపెట్టాక ప్రజలు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. నిత్యావసర సరుకులు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యులపై ఎనలేని భారం మోపుతున్నారని, అంతేకాకుండా రైతులకు వ్యతిరేకంగా రైతు చట్టాలను తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
రానున్న రోజుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు నాయకులు, ప్రజలు, మేధావులు ఐక్యంగా పోరాటం చేసి విజయం సాధించాలన్నారు. తొలుత దుమ్ముగూడెం మండల కేంద్రంలోని లక్ష్మీనగరంలో సీపీఎం నాయకులు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు, నాయకులు పాలడుగు భాస్కరరావు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచి రవికుమార్, కార్యవర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, బ్రహ్మాచారి, వంశీకృష్ణ, చంద్రయ్య, చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.