హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ దేశంలో ప్రజలను కులం, మతం ప్రాతిపదికన విడదీయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు ఆరోపించారు. ఐదు రాష్ర్టాల్లో మొక్కుబడిగా గెలిచిన బీజేపీ, ఇటీవల కొన్ని రాష్ర్టాల ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిందని తెలిపారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నదని పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో పార్టీ సమావేశం అనంతరం రాఘవులు మాట్లాడారు. హిందువుల పండుగలను వేదికగా చేసుకొని దేశంలో సంఘ్ పరివార్ శక్తులు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులకు వ్యతిరేకంగా, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని సీపీఎం తీర్మానం చేసినట్టు చెప్పారు.