మిర్యాలగూడ, మార్చి 1: బీజేపీపై బీఆర్ఎస్ పోరు బాగుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్ ప్రశంసించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని తాము స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ గిరిజన ద్రోహిగా నిలిచారని, గిరిజన రిజర్వేషన్ ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభల ప్రారంభం సందర్భంగా ఏర్పాటుచేసిన మహా ప్రదర్శన, బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఆదివాసీ గిరిజనులకు చెందాల్సిన వాటా కేంద్ర బడ్జెట్లో జనాభా ప్రకారం పెట్టలేదన్నారు. ట్రైబల్ సబ్ప్లాన్ తీసివేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
దేశ జనాభాలో 8.6 శాతం ఉన్న గిరిజనులకు కేంద్ర బడ్జెట్లో 2.7 శాతం మాత్రమే నిధులు కేటాయించారని, ఇది గిరిజనుల పొట్ట కొట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్నాయక్ పాల్గొన్నారు.