శేరిలింగంపల్లి, నవంబర్ 27: అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒకలా, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో మరోలా బీజేపీ వ్యవహరిస్తున్నదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. తాము అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను లొంగదీసుకొనేందుకు సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. టెక్కీస్ ఫర్ ఏ బెటర్ ఇండియా పేరుతో ఆదివారం గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ది ఐడియా ఆఫ్ ఇండియా’ అన్న అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. రాష్ర్టాలన్నింటికీ కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా పెత్తనం చెలాయించాలని చూస్తుండటంతో వివాదాలకు దారితీస్తున్నదని అన్నారు.
పలు రాష్ర్టాల్లో గవర్నర్లు పాలనలో జోక్యం చేసుకొంటూ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. కుల, మతాల పేరుతో మనుషులను విడదీయకుండా సమానత్వంతో చూడాలని హితవుపలికారు. తాను హైదరాబాద్, ఢిల్లీలో చదువుకొన్నానని, తన స్నేహితుల్లో చాలావరకు ముస్లింలు, ఆంగ్లో ఇండియన్లు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. వివిధ సాఫ్ట్వేర్ సంస్థలకు చెందిన ఉద్యోగులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.