CPM Tammineni | మతోన్మాద పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పడం ఖాయమని, తెలంగాణ గడ్డపై బీజేపీకి స్థానం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. సీపీెం జనచైతన్య యాత్రలో భాగంగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్, జూలూరుపాడు మండల కేంద్రాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ఎర్రజెండాలతో బీజేపీకి వ్యతిరేకంగా చేపడుతున్న ర్యాలీకి జనం నీరాజనం పలుకుతున్నారని అన్నారు.
మతతత్వ పార్టీ బీజేపీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని తమ్మినేని ఆరోపించారు. ఇలాంటి రాజకీయ పార్టీ దేశాన్ని పాలిస్తే మనకు రక్షణ ఉండదన్నారు. అందుకే బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా దేశం అంతా ఒక్కటై పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని, సీఎం కేసీఆర్తో కలసి అన్నిరాష్ట్రాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం అయ్యామన్నారు.
గత తొమ్మిదేండ్లలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు భారీగా పెంచిన చరిత్ర కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని తమ్మినేని అన్నారు. పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో ప్రధాని మోదీ, అమిత్షా, జేపీ నడ్దా కలిసి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగుర వేయాలని చూస్తున్నారని, అలాంటి వారి ఆటలు తెలంగాణ గడ్డపై సాగవన్నారు. బీజేపీని వ్యతిరేకించాలని ప్రజలకు చెప్పడానికే ఈ జనచైతన్య యాత్ర చేస్తున్నామన్నారు.
అంబేద్కర్ రాసిన సిద్ధాంతాలను బీజేపీ తుంగలో తొక్కుతుందని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పతనం తప్పదన్నారు. సభలో రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, కాసాని ఐలయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, నాయకులు భూక్యా రమేశ్, ఏజే రమేశ్, మచ్చా వెంకటేశ్వర్లు, గడ్డం స్వామి, లిక్కి బాలరాజు, కొండపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.