నల్లగొండ : దేశ సంపదను పెట్టుబడిదారులకు అమ్మేస్తూ.. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ అభిృద్ధికి ఏమి చేయని మోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం మండిపడ్డారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని జాతీయం చేసేందుకు ప్రధాని రాగా.. పర్యటనకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
మోదీ గోబ్యాక్ అంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ రాష్ట్ర విభజన చట్టాలను అమలు చేయకుండా, అభివృద్ధి చేయకుండా రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రామగుండానికి మోదీ రావడానికి ఖండించారు. సంవత్సరం కాలం నుంచి నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోడీ కొత్తగా కట్టినట్టుగా ప్రారంభించడానికి రావడం ఏంటని ప్రశ్నించారు.
మోదీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, యూనివర్సిటీ, ఉక్కు కర్మాగారం ఇస్తామని ఇవ్వలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించకపోగా.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల వాటా తేల్చకుండానే తగువు పెడుతున్నారని ఆరోపించారు. కృష్ణా-గోదావరి నదులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్తో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని, వెంటనే ఆ గెజిట్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బీజేపీ నీచంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేసి కేసుల పాలైందన్నారు. అందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నికలు తీసుకొస్తే ఉభయ కమ్యూనిస్టులు టీఆర్ఎస్కు మద్దతు తెలిపి.. బుద్ధి చెప్పామన్నారు. రాబోయే రోజుల్లో మోదీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముడిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.శ్రవణ్ కుమార్, గీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బు వీరస్వామి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోల్గురి నరసింహ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టీ వెంకటేశ్వర్లు మునుగోడు మునుగోడు మండల కార్యదర్శి చాపల శీను, సీపీఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, పాలడుగు నాగార్జున, మల్లేశ్, సీహెచ్ లక్ష్మీనారాయణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.