హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు జాతీయ పార్టీ పెట్టుకొనే హక్కు ఉన్నదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. బీజేపీ మతోన్మాద, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికవాద, ప్రజాహక్కుల పరిరక్షణ కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఆదివారం ఆయన హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేకుంటే దేశంలో బీజేపీనే లేదని ఎద్దేవా చేశారు.
ఈడీతో భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈడీ లేకుంటే పలు రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వాలే కూలిపోతాయని చెప్పారు. ఈడీ ఇంకా తమ దాకా రాలేదని, వచ్చినా ఆశ్చర్యపోయేదేమీ లేదని అన్నారు. ఆరెస్సెస్ను 1948లో నిషేధించిన అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ను బీజేపీ తమ మనిషిగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని చెప్పారు.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లిం ఘర్షణగా వక్రీకరించి, ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మూడు వేల గ్రామాలు, 16 వేల చదరపు కిలోమీటర్ల భూమి నిజాం సర్కారు నుంచి విముక్తి చెందాయని, పేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని వివరించారు. హైదరాబాద్ సంస్థానాన్ని కమ్యూనిస్టులు ఆక్రమిస్తారనే భయంతో, నిజాం నవాబు లొంగుబాటుకు అంగీకరించిన తరువాతే భారత సైన్యం ఇక్కడకు వచ్చిందని చెప్పారు.
లొంగుబాటు పూర్తయ్యాక కూడా భారత సైన్యం 1951 వరకు ఇక్కడే ఉండి, భూస్వాముల్ని మళ్లీ పునఃస్థాపన చేసిందని గుర్తుచేశారు. 1950 మార్చి 27 నాటికి 4,482 మంది కమ్యూనిస్టులు జైళ్లలో ఉంటే, 57 మంది రజాకార్లు మాత్రమే జైళ్లలో ఉన్నారని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీనే తమకు ప్రథమ శత్రువని, దాన్ని ఓడించడమే తక్షణ రాజకీయ అవసరమని స్పష్టంచేశారు. సమావేశంలో రాష్ట్ర నేతలు డీజీ నర్సింహారావు, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.