గార్ల, డిసెంబర్ 21: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు వామపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారానికి రానున్న రోజుల్లో కేంద్రంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. నరేంద్ర మోదీ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారాని కి టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాలు చేయడం అభినందనీయమన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాల ని సూచించారు. జీఎస్టీ పేరుతో రాష్ట్ర ఖాజానాకు రావాల్సిన సొమ్మును కేంద్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకొని, తెలంగాణ అభివృద్ధిని దెబ్బతీస్తున్నదని చెప్పారు. కార్మికులు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి తెచ్చుకున్న హక్కులకు బీజేపీ ప్రభుత్వం చరమగీతం పాడి.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదని మండిపడ్డారు.