హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్తో డిసెంబర్ 7న రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్లు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం మఖ్దూంభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీపీఐ కంటే బీజేపీ పెద్ద పార్టీ కాదని, అలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం మంచిదికాదని చురకలేశారు.
రాష్ట్రంలోని 119 నియోజకర్గాల్లో పార్టీ ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేస్తామని, పార్టీ బలంగా ఉన్న 25 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో ప్రధాని మోదీ అన్నీ అబద్ధాలే చెప్పారని, బొగ్గు గనుల వేలం లాంటి దొంగ పనులు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. నెహ్రూ విధానాలను కాంగ్రెస్ క్రమంగా వదులుకుంటున్నదని, ఆ పార్టీ తన పద్ధతి మార్చుకోవాలని హితవు చెప్పారు. తెలంగాణలో కమ్యూనిస్టులతో స్నేహాన్ని కోరుతున్న కాంగ్రెస్ ఇతర రాష్ర్టాల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దేశంలో దామాషా పద్ధతి ఎన్నికల కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. వివిధ రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న బీజేపీ పెద్ద తిమింగలంగా మారిందని విమర్శించారు.
సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి వర్గానికి ఎన్నికైన వారి పేర్లను కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. తనతోపాటు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, పశ్య పద్మ, టీ శ్రీనివాస్రావు, ఎన్ బాలమల్లేశ్, బాగం హేమంత్రావు, కలవేని శంకర్, ఎం బాలనర్సింహ, వీఎస్ బోస్, ఈటీ నర్సింహ రాష్ట్ర కార్యదర్శి వర్గానికి ఎన్నికయ్యారని తెలిపారు.