హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసుల్లో ఇరికించారని, ఇప్పుడు ఢిల్లీ, తెలంగాణలోని బలమైన నేతలపై పడ్డారని మండిపడ్డారు. సిసోడియా, కవిత బీజేపీకి లొంగిపోతే వారిపై కేసులు ఉండబోవని చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్ మగ్దూంభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులను పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ అవినీతి పుట్టగా మారిందని, తమ పార్టీలో చేరినవారిపై కేసులు పెట్టడం లేదని విమర్శించారు. అదానీ విషయంలో ఎందుకు చట్టాలను ప్రయోగించడం లేదని నిలదీశారు. మోదీపై కూడా సహారా, బిర్లా సంబంధిత అవినీతి కేసులు ఉన్నాయని, అమిత్షా, ఆయన కొడుకు మీద కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, అప్పుడు మోదీ, అమిత్షా, బీజేపీ నేతలు జైళ్లకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. రాష్ర్టాల్లో బీజేపీని ఓడించే బలమైన పార్టీకి సహకరిస్తామని, దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చే పాత్ర పోషిస్తామని, అందులో కాంగ్రెస్ కూడా ఉంటుందని చెప్పారు.
ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 5 వరకు ‘సీపీఐ ప్రజా పోరు యాత్ర’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తామని కూనంనేని తెలిపారు. తకెళ్లపల్లి శ్రీనివాస్రావు నేతృత్వంలో బయ్యారం నుంచి హనుమకొండ వరకు 12 రోజులపాటు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. 25న బయ్యారంలో ప్రారంభ సభ, ఏప్రిల్ 5న హనుమకొండలో ముగింపు సభ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 9న హైదరాబాద్లో సీపీఐ, సీపీఎం ఉమ్మడి సభ నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు అజీజ్పాషా, చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, తకెళ్లపల్లి శ్రీనివాస్రావు పాల్గొన్నారు.