బయ్యారం, మార్చి 25: ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. విభజన హామీల అమలు కోసం బయ్యారం నుంచి హనుమకొండ వరకు 12రోజుల పాటు కొనసాగే సీపీఐ ప్రజా పోరాట యాత్రను శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని గాంధీ సెంటర్లో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తొమ్మదేండ్లుగా తెలంగాణపై వివక్ష చూపుతూనే ఉందని విమర్శించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. దేశంలోని 90శాతం సంపద 10 మంది సంపన్నులు వద్దే ఉందని తెలిపారు. దేశాన్ని మతం చిచ్చుతో విచ్ఛిన్నం చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తున్నదని మండిపడ్డారు.