హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)/చండూరు: మునుగోడు ఉప ఎన్నిక తీర్పుతో దేశానికి పట్టిన బీజేపీ గ్రహణం వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం చండూరులో పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అధికార బలంతో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలో భాగమే మునుగోడు ఉప ఎన్ని క అని విమర్శించారు. దక్షిణాదిలో బీజేపీని విస్తరించడానికి రాజగోపాల్రెడ్డి పావుగా మునుగోడుకు ఉపఎన్నిక తీసుకొచ్చారని ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ము ఒక్క టీఆర్ఎస్కే ఉన్నదన్నారు. ఎంపీ వెంకట్రెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతూ తమ్ముడు రాజగోపాల్కు ఓటు వేయాలని ఫోన్ చేయడం ద్వారా బీజేపీ ఓటమిని అంగీకరిస్తున్నట్టేనన్నారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి
దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ కుట్రలను నేటి యువత తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. బుధవారం జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కార్ కార్పొరేట్ అనుకూల విధానాలను ఆమోదిస్తూ, సహజ వనరులను కొల్లగొడుతున్నదని మండిపడ్డారు. ఫలితంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని పేర్కొన్నారు.