హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ప్రభుత్వం కొంతమంది కార్పొరేట్లకు అనుచిత ప్రయోజనాలు కల్పించేందుకు దేశ సామాన్య ప్రజలపై మోయలేని భారాలను వేస్తూ వివక్షాపూరిత విధానాలు అనుసరిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ఆరోపించారు. ఇంధన, గ్యాస్, నిత్యావసరం వస్తువుల ధరలను అధికంగా పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను పట్టపగలు దోచుకుంటుందని దుయ్యబట్టారు.
వంట, వాణిజ్య గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి హిమాయత్నగర్ వై జంక్షన్ వరకు గురువారం ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ నేతలు సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివ రావు, వీఎస్ బోస్, ఈటీ నరసింహ, ఎన్. బలమల్లేష్, ఏం బాల నరసింహ, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవిలతోపాటు వందలాదిమంది సీపీఐ ఎర్ర జెండాలు, ప్లకార్డులు చేతబూని ఈ ప్రదర్శనలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా మాట్లాడుతూ .. నేడు దేశంలో ప్రజలు తమ జీవనోపాధి కోసం పోరాడుతున్న సమయంలో వంట, వాణిజ్య గ్యాస్ ధరలను పెంచడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. కేంద్ర నిర్ణయం కోట్లాది కుటుంబాలను, చిరు వ్యాపారులను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ హయాంలో ప్రతి వస్తువు ధర పెరగడంతో ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, గ్యాస్ సబ్సిడీ కూడా ఎత్తివేడంతో కేంద్ర ప్రభుత్వం ఎవరికీ సహాయం చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి విఫలమైందని మండిపడ్డారు. వంట, వాణిజ్య గ్యాస్ ధరల పెంపుతో గృహ, చిరు వ్యాపారాలపై తీవ్రంగా ప్రభావం పడుతుందని అన్నారు. ఈ ప్రదర్శనలో సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బీ స్టాలిన్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బీ వెంకటేశం, శ్రామిక మహిళా ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ పీ ప్రేమ్ పావని, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, పడాల నళిని, నేతలు విజయలక్ష్మి పండిట్, శక్రి భాయి, అమీనా, మహమూద్, షహనా అంజుమ్, ఏం అనిల్ కుమార్, ఆరుట్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.