CPI Chada Venkat Reddy | కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గట్టేందుకు ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 14 నుంచి మే 15 వరకు `పల్లెపల్లెకు సీపీఐ కార్యక్రమం` ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తులు ఉంటాయనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈసారి అసెంబ్లీలో వామపక్షాల ప్రాతినిధ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు.
మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని చాడ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను దుర్మార్గులుగా చూపుతూ స్వపక్షంలోని అవినీతి పరులను వెనకేసుకొస్తూ బీజేపీ ప్రభుత్వం అనేక కుట్రలకు తెరలేపుతున్నదని ఆరోపించారు.
ప్రజలు నిత్యం వాడే మందులపై టాక్స్ పెంపు మొదలు పెట్రో ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్రం పెనుభారం మోపుతున్నదని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం రూ.168 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో రూ.106 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కేవలం ఈ ఏడాదిలోనే రూ.15.4లక్షల కోట్ల అప్పులు తెచ్చి దేశాన్ని అప్పుల్లో ముంచుతున్న ఘనత బీజేపీ ప్రభుత్వానికే చెందుతుందన్నారు.
కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్రమోదీ చిన్నాభిన్నం చేస్తున్నారని చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. కార్పొరేట్లు ఆదానీ, అంబానీల కనుసన్నల్లోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు. అదానీ అక్రమాలపై జేపీసీ వేసేందుకు వెనుకంజ వేస్తున్నారంటేనే బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వమని తెలుస్తున్నదని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనులను ఎన్నటికీ ప్రైవేటుపరం చేయమని చెప్పిన ప్రధానమంత్రి నాలుగు బొగ్గు బ్లాక్లకు టెండర్లు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. దేశ ప్రధానమంత్రి అబద్దాలు చెప్పడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు.