మహబూబాబాద్, మార్చి 26: దేశంలో మతోన్మాద శక్తులపై సీపీఐ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన బొమ్మ అని, ఆర్ఎస్ఎస్ సిద్ధ్దాంతాలకు కట్టుబడి పాలన సాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ పోరుయాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
గుజరాత్లో మారణహోమానికి కారణమైన వ్యక్తి ప్రధాని కావడం ఈ దేశ ప్రజల దురదృష్టమని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రధానమైన హామీలని, అవి నేటికీ అమలు కాలేదని గుర్తుచేశారు. మహబూబాబాద్ ప్రాంతం మైన్స్, మినరల్స్ ఉన్న ప్రాంతమని, ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే లక్షల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని తెలిపారు. దేశంలో మొత్తం 89 మంది బ్యాంక్ లోన్లు ఎగ్గొడితే.. అందులో ఒక్క విజయ్మాల్య తప్ప 88 మంది గుజరాత్కు చెందిన వారే ఉండడం గమనార్హమని నారాయణ ఉద్ఘాటించారు.