హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 16న కామారెడ్డిలో జరిగిన ఓ వివాహానికి హాజరైన సందర్భంలో వేదిక వద్ద జారిపడ్డారు. అయితే అప్పుడు ఆయన పట్టించుకోలేదు. అక్కడి నుంచి విశాఖపట్నం, చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంలో నారాయణకు పక్కటెముక వద్ద నొప్పి వచ్చింది. ఏఐజీ డాక్టర్లను సంప్రదించగా రిబ్ ఎముక విరిగినట్లు నిర్ధారించి, రెండు వారాల విశ్రాంతి తప్పనిసరి అని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో నారాయణ విశ్రాంతి తీసుకుంటున్నారు. నారాయణ పరిస్థితిని తెలుసుకున్న పార్టీ నాయకులు ఆయనను పరామర్శిస్తున్నారు.