హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు పిలువలేదో చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో ఆయన మాట్లాడారు. దేశంలో సీబీఐ, న్యాయవ్యవస్థ దిగజారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా పనిచేసిన కొందరు న్యాయమూర్తులకు ఉద్యోగ విరమణ తర్వాత ఉన్నత పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు.
ఒక న్యాయమూర్తి ఏపీ సీఎం జగన్ వద్దకు స్వయంగా వెళ్లి కలవడం న్యాయవ్యవస్థ దిగజారిపోయిందనడానికి మరో నిదర్శనమని పేర్కొన్నారు. చంపిన వాడు, హత్యకు కుట్ర పన్నినవాడు శిక్షార్హులేనని, ఇందుకు మాజీ ఎంపీ వివేకా హత్యకేసులో సీబీఐ కోర్టుకు ఇచ్చిన నివేదిక చాలని చెప్పారు. ఈ కేసులో సీఎంకు భాగస్వామ్యం ఉందనేలా ఆరోపణలు వచ్చినందున జగన్ తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో దిగజారి పనిచేసిన అధికారిని సీబీఐ డైరెక్టర్ను చేశారని విమర్శించారు.