CPI Narayana | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమ పార్టీ వైఖరి.. ‘తిట్టబోతే అక కూతురు.. కొట్టబోతే కడుపుతో ఉంది’ అన్నట్టు ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ మద్దతుతో కొత్తగూడెం ఎమ్మెల్యేగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు గెలిచారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సీపీఐ ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని, ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి బలపడుతున్నదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తప్పిదాల వల్లనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ర్టాల్లో గెలుపొందిందని అన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించి ఓట్లు దండుకోవాలని బీజేపీ భావిస్తున్నదని చెప్పారు. పార్లమెంట్పై పొగబాంబు దాడి జరిగితే జవాబు చెప్పలేని బీజేపీ 148 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిందని విమర్శించారు. అదానీని అన్ని విషయాల్లో బీజేపీ కాపాడుతున్నదని, అందుకే అదానీ అకౌంట్లపై సెబీ అభ్యంతరం చెప్పినా.. సుప్రీంకోర్టు ద్వారా గడువు కల్పించారని ఆరోపించారు. వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్లోకి తీసుకుని జగన్ని భయపెట్టారని చెప్పారు. ఏపీలో జగన్ సరారు పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.