Narayana | హైదరాబాద్ : రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనా కొనసాగించారని, నేడు ప్రధాని మోదీ రైతు శత్రువుగా మరి దుర్మార్గపు పాలనా కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.
హిమాయత్నగర్లోని మగ్ధుం భవన్లో సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో చారిత్రక ఛత్రపతి ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముందుగా ఛత్రపతి శివాజీ చిత్రపటానికి నారాయణ, వీఎస్ బోస్, బాల నరసింహ, ఎస్ ఛాయాదేవి, స్టాలిన్, బీ వెంకటేశం, నేదునూరి జ్యోతి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. నాలుగు వందల సంవత్సరాల క్రితం రైతుల సంక్షేమం, వారి ప్రయోజనాల కోసం ఛత్రపతి శివాజీ అనేక సంస్కరణలు తన పరిపాలనలో తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. తన రాజ్యంలోని రైతులను నేరుగా పిలిపించి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. భూస్వామ్య వ్యవస్థను తొలగించి నూతన రెవెన్యూ వ్యవస్థను నెలకొల్పడం జరిగిందన్నారు. రైతులు పండించిన పంట దిగుబడి ఆధారంగా ఆ పంట యొక్క విస్తీర్ణాన్ని కొలిచి, ఆ తర్వాత మాత్రమే పన్నులు వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు.
నేడు అధికారంలో కొనసాగుతున్న మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తానని పార్లమెంటులో ప్రగల్బాలు పలికిన మోదీ అనంతరం హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేసాడని మండిపడ్డారు. రైతులు తిరిగి తమ హక్కులను సాధించుకోవడానికి చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కానీ రాజధానికి బయలుదేరిన రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పోలీసు సైన్యం పహారాల మధ్య ఢిల్లీ బోర్డర్లను ప్రభుత్వం దిగ్భందించడం సిగ్గుచేటన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ చర్యలన్నింటినీ ప్రతిఘటిస్తూ ముందుకు వస్తున్న రైతులపై రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ల సహాయంలో పిల్లేట్లను వదులుతూ, లాఠీచార్జి చేస్తూ రైతులను గాయపరుస్తున్నాని మండిపడ్డారు. ప్రజలకు అన్నం పెడుతున్న రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన, ప్రజాస్వామిక వాదులపైన ఉన్నదని నారాయణ తెలిపారు.