హైదరాబాద్ : గవర్నర్ల వ్యవస్థపై సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, కేంద్రానికి అనుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం అనే విధంగా గవర్నర్ల వ్యవస్థ మారిపోయింది. మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడుతున్నప్పటి నుంచి గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. రాజ్ భవన్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని నారాయణ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని గవర్నర్.. అమిత్ షాకు ఫిర్యాదు చేసిన విషయాన్ని నారాయణ ప్రస్తావించారు. గుజరాత్లోని ముంద్రా పోర్టు నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా అవుతుంది. ఆప్ఘనిస్తాన్ నుంచి వస్తున్న డ్రగ్స్ను గుజరాత్ కేంద్రంగా దేశమంతా విస్తరిస్తున్నారు. అట్లాంటి రాష్ట్రం నుంచి ఎంపీగా ఉన్న అమిత్ షాకు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం తనకు మర్యాద ఇవ్వట్లేదని గవర్నర్ మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకురాలిగానే రాజ్భవన్లో ఆమె ప్రవర్తిస్తున్నారు. బీజేపీ పద్ధతుల్లోనే ఆమె వ్యవహరిస్తున్నారు. గవర్నర్ల వ్యవస్థే సరికానే కాదు. ఈ వ్యవస్థ ఉత్సవ విగ్రహం లాంటిందని నారాయణ విమర్శించారు.