హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని వెంటనే రీకాల్ చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళిసై రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజాదర్బార్ పెట్టేహక్కు గవర్నర్కు ఎక్కడుందని ప్రశ్నించారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళిసై ఓ రాజకీయ నాయకురాలిగా ఉపన్యాసం ఇచ్చారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థ పనికిరాదని ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు.
గవర్నర్ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులకు అడ్డుపడతారా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ప్రతిపాదనను ఆపడం సరికాదని సూచించారు. గవర్నర్ ఏ అంశమైన రాష్ట్రపతికి మాత్రమే రిపోర్టు చేయాలని, ప్రధాని, హోం మంత్రులకు నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నదని చెప్పారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు.
ప్రధాని మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానిగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారని, ఏండ్లు గడుస్తున్నా రాజధాని నిర్మాణం ముందుకు కదలడం లేదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మిన మోదీ.. రేపు విశాఖపట్నం వస్తున్నారని, ఆయన రాకకు నిరసనగా పట్టణ బంద్కు పిలుపునిస్తున్నామని, నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని చెప్పారు.