హైదాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/చిక్కడపలి: హైదరాబాద్లో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాపై చర్చిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. మూడ్రోజుల పాటు జరిగే సమావేశాలు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముసాయిదాపై పార్టీ సభ్యులు నెల రోజుల్లోగా సూచనలు, సలహాలు, అభిప్రాయాలు వ్యక్తంచేసే అవకాశం ఉన్నదని ఏచూరి పేర్కొన్నారు. సవరణల అనంతరం రాజకీయ ముసాయిదాను కేరళలోని కన్నూర్లో ఏప్రిల్లో నిర్వహించనున్న జాతీయ మహాసభల్లో ప్రవేశపెడతామని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేంద్ర కమిటీలో చర్చిస్తామని వెల్లడించారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలంగాణ మలయాళీ అసోసియేషన్తో తలపెట్టిన సమావేశాన్ని కొవిడ్ వ్యాప్తి కారణంగా రద్దు చేసినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కేరళవాసుల విజ్ఞప్తి మేరకు శనివారం సాయంత్రం విజయన్ వర్చువల్ పద్ధతిలో ప్రసంగిస్తారని చెప్పారు. కేంద్ర కమిటీ సమావేశాలకు సీతారాం ఏచూరితో పాటు పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బీవీ రాఘవులు, బృందాకరత్, పినరాయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తదితరులు హాజరయ్యారు.